మహబూబాబాద్(చైతన్యగళం):
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం వైభవంగా జరిగింది.
హైదరాబాద్లోని శిల్పకళా వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని రైతులకు ఎకరాకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
మహబూబాబాద్ పట్టణంలోని ఏటి గడ్డ తండా రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు.
జిల్లాలోని 2,28,887 మంది రైతులకు రూ.277.61 కోట్ల రైతు భరోసా నిధులు అందనున్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ఉద్యానవన & పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న, ఏడీఏ శ్రీనివాస్ రావు, ఎల్డీఎం యాదగిరి, వ్యవసాయ అధికారి తిరుపతి రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.