షాద్నగర్ (చైతన్యగళం):
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆశీస్సులతో మంజూరైన రూ.1.27 కోట్ల నిధులతో టీచర్స్ కాలనీలోని సేవాలాల్–తుల్జా భవాని దేవాలయ ప్రాంగణంలో నిర్మించనున్న ఎస్టీ కమ్యూనిటీ హాల్ పనులను సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అందే మోహన్, ఆరవ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్, మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, మాజీ కౌన్సిలర్ లతా, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బసవేశ్వర్ మాట్లాడుతూ, “గిరిజనుల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కమ్యూనిటీ హాల్ గిరిజన సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో కూడా గిరిజనుల అభివృద్ధి కోసం ప్రతి పనిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో చేపడతాం” అని అన్నారు.
ఆరవ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్ మాట్లాడుతూ, “గిరిజనులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నాం. కమ్యూనిటీ హాల్ గిరిజన కుటుంబాల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల పక్షపాతి ప్రభుత్వమని మరోసారి నిరూపితమైంది” అని పేర్కొన్నారు.
గిరిజనులు ఈ అభివృద్ధి పనులను స్వాగతిస్తూ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.