CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 9:33 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమ విక్రయాలపై విద్యాశాఖ హెచ్చరిక

మహబూబాబాద్, జూన్ 29 (చైతన్యగళం):
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలను పాఠశాల ప్రాంగణంలో విక్రయించడం, తల్లిదండ్రులను నిర్దిష్ట దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని బలవంతం చేయడం ఇకపై సహించబోమని జిల్లా విద్యాశాఖ స్పష్టం చేసింది.జిల్లా విద్యాధికారి ఆర్‌సీ నం.1489/బి-4/2026, తేదీ 30-05-2026 ద్వారా అన్ని మండల విద్యాధికారులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో పుస్తకాలు, యూనిఫాంల విక్రయాలు పూర్తిగా నిషేధించబడ్డాయని, తల్లిదండ్రులపై ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలనే అమలు చేయాలని సూచించారు.మండల విద్యాధికారులు తమ పరిధిలోని పాఠశాలలను నిరంతరం తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.తల్లిదండ్రులు పాఠశాలలు అక్రమ విక్రయాలు నిర్వహిస్తున్నా లేదా నిర్దిష్ట దుకాణాలను బలవంతపెడుతున్నా వెంటనే సంబంధిత ఎంఈఓ లేదా జిల్లా విద్యాధికారి కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.