CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 1:56 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మధిర రైతు ఆశీర్వాద సభ రద్దు.. హైదరాబాద్‌కు షిఫ్ట్

ఖమ్మం జిల్లా మధిరలో రేపు(మంగళవారం) జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దైంది. వర్షాల కారణంగా సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో మధిరలో జరగాల్సిన సీఎం రేవంత్‌ రెడ్డి సభలో మార్పులు చేశారు.

హైదరాబాద్, జూన్ 29(చైతన్యగళం): ఖమ్మం జిల్లా మధిరలో రేపు(మంగళవారం) జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దైంది. వర్షాల కారణంగా సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో మధిరలో జరగాల్సిన సీఎం రేవంత్‌ రెడ్డి సభలో మార్పులు చేశారు. రేపు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతుభరోసా పంపిణీ సదస్సు నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి.. రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు.

మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురంలో రేపు రైతు ఆశీర్వాద సభ జరగాల్సి ఉంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై.. రైతుభరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు లక్ష మందితో సభ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని… అందుకు తగ్గట్టుగా జగన్నాథపురంలో ఏర్పాట్లు చేశారు.

అయితే, రెండు రోజులుగా కురుస్తున్న భారీగా వర్షాలకు సభా ప్రాంగణంలో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది. దీంతో సభ నిర్వహించేందుకు అవకాశం లేదని మంత్రులు, సీఎంవో కార్యాలయానికి జిల్లా అధికారులు తెలియజేశారు. దీంతో ప్రభుత్వం మధిరలో సభను రద్దు చేసి.. సభా వేదికను హైదరాబాద్‌కు మార్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఈ సమావేశంలో పాల్గొననున్నారు.