CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 8:35 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పోలియో రహిత సమాజమే రోటరీ లక్ష్యం

మహబూబాబాద్, జూన్ 28 (చైతన్య గళం): పోలియో నిర్మూలనలో రోటరీ క్లబ్ ప్రధాన పాత్ర పోషిస్తోందని మహబూబాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు వేమిశెట్టి కిషోర్ కుమార్ తెలిపారు.

ఆదివారం రైల్వే స్టేషన్‌లో రోటరీ ఆధ్వర్యంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా జీవితాంతం రక్షణ కల్పించవచ్చు. తల్లిదండ్రులు ప్రతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.

రోటరీ వ్యవస్థాపకుడు మాలె నాగేశ్వరరావు, జిల్లా నాయకులు వద్దుల సురేందర్ రెడ్డి, బిక్కి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ శాంతి వంటి రంగాల్లో రోటరీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నదని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, మహిళల స్వయం ఉపాధి కోసం కూడా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

కార్యక్రమంలో ట్రెజరర్ శంతన్ రామరాజు, సీనియర్ రొటేరియన్లు బోనగిరి గిరిధర్ గుప్తా, ముల్లంగి మోహన్ రెడ్డి, వల్లాల రమేష్, వైద్య సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, పోలియో నిర్మూలనపై అవగాహన కల్పించారు.