చైతన్యగళం జూన్ 27 హుస్నాబాద్
హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై వరుసగా ఆరు దుకాణాలు, వాటి వెనుక ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని భారీ చోరీలకు పాల్పడ్డారు. నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను అపహరించడంతో బాధితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు వ్యాపారులు దుకాణాలు మూసివేసి వెనుక భాగంలోని ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు భవనాలపైకి ఎక్కి, అంతర్గత మెట్ల మార్గం ద్వారా లోపలికి ప్రవేశించి చోరీలకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రధాన షట్టర్లను పగులగొట్టకుండా లోపలికి చేరుకోవడం గమనార్హం.దుకాణాల్లోని నగదుతో పాటు ఇళ్లలోని బీరువాలను పగులగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక ఇంట్లో సుమారు 18 తులాల బంగారం, రూ.30 వేల నగదు, మరో ఇంట్లో పావు తులం బంగారం, రూ.10 వేల నగదు, ఇంకో ఇంట్లో రూ.12 వేల నగదు అపహరించబడింది. మిగతా ఇళ్లు, దుకాణాల్లో జరిగిన నష్టం వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.చోరీ సమయంలో దుండగులు బీరువాల్లోని దుస్తులు, పత్రాలను చెల్లాచెదురు చేయడంతో పాటు వంటగదిలోని వస్తువులను కూడా అస్తవ్యస్తం చేశారు. ఉదయం నిద్రలేచి చోరీ విషయం గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీస్ స్టేషన్కు అతి సమీపంలోనే ఈ ఘటన జరగడం స్థానిక వ్యాపారుల్లో ఆందోళన కలిగించింది. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీని మరింత పటిష్ఠం చేయాలని వారు కోరుతున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, దొంగలు వచ్చిన మార్గాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.