చైతన్యగళం హుస్నాబాద్, జూన్ 27 : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కృషితో అక్కన్నపేట మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల పరిపాలనా అనుమతిని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాలు లేదా శిథిలావస్థలో ఉన్న 10 రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు (ఆర్డీవోలు), 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాల నిర్మాణం కోసం మొత్తం రూ.263.25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ జి.ఓ. విడుదల చేసింది. ఇందులో భాగంగా అక్కన్నపేట తహసీల్దార్ కార్యాలయానికి రూ.2.25 కోట్ల నిధులు కేటాయించారు కొత్తగా ఏర్పడిన అక్కన్నపేట మండలంలో ఆధునిక సౌకర్యాలతో తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం పూర్తయితే ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందనున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్యాలయ వసతి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించనుంది ఈ సందర్భంగా అక్కన్నపేట మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మంత్రి నిరంతరం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని వారు అభినందించారు.