CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 9:26 pm Posted by : CHAITHANYA GALAM NEWS

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి -పోలీసు అధికారుల పిలుపు

మహబూబాబాద్, జూన్ 25 (చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల కళాశాలలో గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. రాజసుధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టౌన్ ఎస్సైలు సూరయ్య, బసురుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “విద్యార్థులు ఎలాంటి చెడు అలవాట్లకు లోనుకాకుండా చదువుపై దృష్టి సారించాలి. ఒకసారి డ్రగ్స్‌కు బానిసైతే జీవితమే నాశనమవుతుంది” అని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100, 1098 నంబర్లకు సమాచారం అందించాలని, సమాచారదాత వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

టీనేజ్ వయసులో ఉన్న విద్యార్థులు గురువుల సూచనలను పాటిస్తూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు, స్వగ్రామానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ప్రిన్సిపాల్ రాజసుధ మాట్లాడుతూ, “విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి సన్మార్గంలో నడుస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి” అని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల కోఆర్డినేటర్ టి. జవహర్ లాల్, షేక్ నాగుల్ మీరా, రాజు, అనిల్, బాలాజీ, పోలీసు సిబ్బంది కాసిం, అనిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.