హైదరాబాద్/సెక్రటేరియట్, జూన్ 25 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ కార్యాలయంలో గురువారం స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ మరియు వయోవృద్ధుల శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ వినతిని ఎన్పీఆర్డీ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కే. వెంకట్, తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ కలిసి అందజేశారు. రాష్ట్రంలో ప్రయివేట్, సిబిఎస్ఈ విద్యాసంస్థల్లో స్పెషల్ టీచర్స్ నియమించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం (యాక్ట్ 92) ప్రకారం సెక్షన్ 16, 17, అలాగే జివో యం.ఎస్. నెం. 3 (01.05.2018) ప్రకారం ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు అంగవైకల్యం కలిగిన పిల్లలకు సమగ్ర విద్య అందించడంతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాల్సిన బాధ్యత ఉందని వారు గుర్తు చేశారు. సిబిఎస్ఈ ఆఫిలియేషన్ బై లా మరియు 2024 మార్గదర్శకాల ప్రకారం కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ సౌకర్యాలు కల్పించి స్పెషల్ ఎడ్యుకేటర్లను నియమించాల్సిన అవసరం ఉందని వివరించారు.
అయితే రాష్ట్రంలోని అనేక ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఈ నిబంధనలు అమలు కావడం లేదని, బహుళ అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ లిఫ్ట్, ర్యాంపు సౌకర్యాలు లేకపోవడం వల్ల వికలాంగుల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అంగవైకల్యం కలిగిన పిల్లలకు ప్రవేశం కల్పించడంతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్లు, రిసోర్స్ టీచర్స్ నియామకం తప్పనిసరి చేయాలని, అంగన్వాడీ టీచర్స్ సహాయ టీచర్స్ పోస్టుల్లో 5 శాతం వికలాంగుల మహిళలకు కేటాయించాలని వారు వినతిపత్రంలో కోరారు.