CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 9:21 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

మహబూబాబాద్, జూన్ 25 (చైతన్యగళం): విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఈ వయసులో మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకుంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సీనియర్ న్యాయవాది వై. చెన్న మల్లా రెడ్డి పేర్కొన్నారు.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గౌతమి ఇంటర్మీడియట్ కళాశాలలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. “స్నేహితుల ప్రభావం, క్షణికానందం కోసం డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చట్టం ముందు ఎవరూ మినహాయింపు కాదు” అని విద్యార్థులకు హెచ్చరించారు.

గౌతమి కళాశాల కరస్పాండెంట్ తక్కెలపల్లి సంధ్యారాణి మాట్లాడుతూ, విద్యార్థులు చదువు, క్రీడలు, సృజనాత్మక నైపుణ్యాలపై దృష్టి సారించి లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు. గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులకు, విద్యాసంస్థకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన మాదకద్రవ్యాల నివారణపై లఘు చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. యూ. అరుణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.