CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 9:03 pm Posted by : CHAITHANYA GALAM NEWS

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పిలుపు

మహబూబాబాద్, జూన్ 24(చైతన్యగళం): జిల్లా ఎస్పీ డా. శబరీష్ యువత తమ జీవిత లక్ష్యాల సాధనపై దృష్టి సారించి, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన “మన ఊరు – మన బాధ్యత” కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ – “గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయి. విద్యార్థులు చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలి. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు. ‘Say No to Drugs – Say Yes to Life’ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలి” అని సూచించారు.

అనంతరం గంజాయి వ్యతిరేక పోస్టర్లను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి ప్రదర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన “వాల్ ఆఫ్ ప్రామిస్” వద్ద విద్యార్థులతో గంజాయి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులు ప్రమాణం చేశారు.

గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి ₹5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని ఎస్పీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు.