CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 9:48 pm Posted by : CHAITHANYA GALAM NEWS

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

టీమిండియా యువ సంచలనం ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు ఈ దేశాలకు పయనమయ్యాడు. ఈ క్రమంలోనే ఈ 15 ఏళ్ల బుడ్డోడికి ఇంగ్లండ్ లో స్వల్ప అవరోధం కలగనుంది. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనలకు వైభవ్‌తోపాటు అతడి తల్లిదండ్రులు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లండ్‌లో మాత్రం వైభవ్‌ సూర్యవంశీకి భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండే అవకాశం లేకుండా పోతుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. దీనికి కారణం అక్కడి నిబంధనలేనని సమాచారం.

జులై 1 నుంచి ఇంగ్లండ్‌లో భారత్ పర్యటించనుంది. ఐసీసీ, ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు ఆటగాళ్లకు ప్రత్యేక గదులు కేటాయిస్తారు. అయితే, ఈ విషయంపై బీసీసీఐ అధికారులు ఇంగ్లండ్‌ బోర్డు ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

‘ఇది ఐసీసీ ఈవెంట్. కాబట్టి వారి విధించిన భద్రతా విధానాలు అమల్లో ఉంటాయి. 16 ఏళ్లలోపు ఆటగాళ్లు పెద్దల డ్రెస్సింగ్ రూమ్స్‌ను వాడేందుకు అనుమతి లేదు. కాబట్టి, సూర్యవంశీకి ప్రత్యేకంగా గదిని కేటాయించే అవకాశం ఉంది. అతడితో పాటు తల్లిదండ్రులు కూడా వస్తారు. వారికి కూడా ప్రతి వేదిక వద్ద వసతి సదుపాయం కల్పిస్తాము. మ్యాచ్‌ సమయంలో మాత్రమే వైభవ్‌కు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఉంది. మ్యాచ్‌కు ముందు.. తర్వాత ఛేంజింగ్‌ కోసం వెళ్లడానికి అనుమతి ఉండదు’ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.