CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 9:23 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మద్యపానం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

కరీంనగర్, జూన్ 24 (చైతన్యగళం): మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా మానుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు.

కరీంనగర్ నగరంలోని అశోక్‌నగర్ మాదకద్రవ్య–మద్యపాన వ్యసన విముక్తి కేంద్రాన్ని బుధవారం సాయంత్రం కలెక్టర్, పోలీస్ కమిషనర్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు.

ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ, బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, పునరావాస కార్యక్రమాలపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, చికిత్స పురోగతిని తెలుసుకున్నారు.

వైద్యుల సూచనల మేరకు చికిత్సను పూర్తిగా కొనసాగించి మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగాన్ని శాశ్వతంగా మానుకోవాలని సూచించారు. “వ్యసనాల వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. వ్యసనాలకు దూరంగా ఉంటేనే మంచి ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది” అని కలెక్టర్, కమిషనర్ పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల ఆశలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని బాధితులకు ప్రోత్సాహం అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి, నాగేశ్వరరావు, కేంద్ర నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.