అమరావతి, జూన్ 24(చైతన్యగళం): ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించింది. ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ఉపాధ్యక్షుడు జోహన్నెస్ జుట్, లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ అండ్ టీటీఎల్-(అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు-ఏఐయూడీపీ) గెరాల్డ్ పాల్ ఒలివర్, ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ సౌమ్య బజాజ్లతో కూడిన బృందం అమరావతిలో పర్యటించింది.
ప్రపంచ బ్యాంకు బృందం తొలుత ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించింది. అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టు (AIUDP) కింద చేపడుతున్న పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో చేపడుతున్న ట్రంక్ రోడ్ల నిర్మాణం, గ్రావిటీ కెనాల్ అభివృద్ధి, ఇతర కీలక మౌలిక సదుపాయాల పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులు ఆయా సైట్ల వద్ద పనుల పురోగతిని ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు.
అనంతరం ప్రపంచ బ్యాంకు బృందం ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీని సందర్శించింది. ఏపీసీఆర్డీఏ సోషల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో.. యూనివర్సిటీలో ఉచితంగా నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను పరిశీలించింది. శిక్షణలో చేరిన అభ్యర్థులతో అమరావతిలో లభించే ఉపాధి అవకాశాలపై ప్రపంచ బ్యాంకు బృందం పరస్పర చర్చ నిర్వహించింది.