CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 9:39 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పచ్చదనానికి అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ చేపట్టాలి

విద్యార్థుల్లో ప్రకృతి పట్ల అవగాహన పెంపొందించాలి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నందికొట్కూరు, జూన్ 23 (చైతన్యగళం):
జిల్లాలో చేపడుతున్న హరితాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, విద్యాసంస్థల ఆవరణలను పచ్చదనంతో నింపాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.మంగళవారం జూపాడుబంగ్లా మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా విద్యాసంస్థల ప్రాంగణాల్లో చేపట్టిన అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించి, మొక్కల పెంపకం, సంరక్షణ, నీటి వసతి, వాటి పెరుగుదల స్థితి తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం గురుకుల విద్యాసంస్థలో ఉద్యానవన అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, నాటిన మొక్కల నిర్వహణ, ప్రాంగణ సుందరీకరణ, పచ్చదనం విస్తరణకు చేపడుతున్న చర్యలను పరిశీలించి, పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.పాఠశాలల ఆవరణల్లో విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారా విద్యార్థులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ విధానంలో తక్కువ విస్తీర్ణంలో అధిక సంఖ్యలో మొక్కలను పెంచే అవకాశం ఉండటంతో పచ్చదనం వేగంగా విస్తరిస్తుందని వివరించారు.నాటిన ప్రతి మొక్క జీవించి ఎదిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మొక్కల సంరక్షణ బాధ్యతను పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు భాగస్వామ్యంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ భాగస్వాములు కావాలని, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను దత్తత తీసుకుని దాని సంరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.పాఠశాలల్లో పర్యావరణహిత కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై బాధ్యతాయుతమైన దృక్పథం పెంపొందుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం గురుకుల విద్యాసంస్థలోని డైనింగ్ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ మరియు సిబ్బందికి సూచించారు.