CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 1:59 pm Posted by : CHAITHANYA GALAM NEWS

హైదరాబాద్ మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు సఫలం

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి.. కేంద్రమంత్రులతో జరిపిన వరుస సమావేశాలు విజయవంతమయ్యాయి.

హైదరాబాద్, జూన్ 23 (చైతన్యగళం): హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి.. కేంద్రమంత్రులతో జరిపిన వరుస సమావేశాలు విజయవంతమయ్యాయి. మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, అలాగే ఫేజ్-2 విస్తరణ పనుల్లో ఉన్న అన్ని ప్రధాన ఆటంకాలు ఈ చర్చలతో తొలగిపోయాయి. ఈరోజు (మంగళవారం) ఉదయం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు ఉన్నతస్థాయి సంయుక్త సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్ (రైల్వే శాఖ), జి. కిషన్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మెట్రో విస్తరణ, నిధుల సమీకరణ, కేంద్ర-రాష్ట్ర ఉమ్మడి భాగస్వామ్యంపై ఈ సమావేశంలో అందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు.

కన్సల్టెంట్‌గా ‘SBICAPS’ ఎంపిక.. విధివిధానాలు ఇవే..

మెట్రో ప్రాజెక్టును ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిష్ఠాత్మక ఆర్థిక సలహా సంస్థను ‘SBICAPS’ (SBI Capital Markets) కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. ఈ సంస్థ ప్రధాన అంశాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వనుంది.

ఫేజ్-1 వాల్యూయేషన్: ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో ఫేజ్-1 (69 కి.మీ) ను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన అప్పులు, ఈక్విటీ విలువ (వాల్యూయేషన్) రుణ సేకరణపై SBICAPS రోడ్ మ్యాప్ తయారు చేస్తుంది.

ఫేజ్-2 నివేదిక:ఫేజ్-2 కింద ప్రతిపాదించిన కారిడార్ల నిర్మాణ వ్యయం ఎంత అవుతుంది? నిధుల కోసం ఏయే అంతర్జాతీయ రుణ సంస్థలను ఎంచుకోవాలి? అనే అంశాలపై నివేదిక అందిస్తుంది.

ప్రభుత్వాల నిర్ణయం: ఈ కన్సల్టెంట్ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తదుపరి అడుగులు వేస్తాయి.

ప్రక్రియను వేగవంతం చేసేందుకు ‘సమన్వయ కమిటీ’

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్రప్రభుత్వ ప్రతినిధితో పాటు తెలంగాణ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (MA&UD) ప్రత్యేక కార్యదర్శి సమన్వయ సభ్యులుగా వ్యవహరిస్తారు. కేంద్ర నిబంధనల ప్రకారం డీపీఆర్ (DPR) లలో మార్పులు చేస్తూ, పనుల అనుమతుల ప్రక్రియను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ పరిణామంతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (దాదాపు 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్లు) విస్తరణకు కేంద్ర ఆమోదం లభించడం సులభతరం కానుంది. ఇది హైదరాబాద్ నగర ట్రాఫిక్ కష్టాలను తీర్చడమే కాక, భవిష్యత్తు ప్రజా రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలవనుంది.