ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు – పిస్టల్, బైక్, ఆధారాలు స్వాధీనం
కరీంనగర్, జూన్ 23 (చైతన్యగళం):
మే 3న కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసులో పోలీసులు మరో కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి పిస్టల్, మ్యాగజైన్, బైక్, దోపిడీ రోజు ధరించిన ఐదు జతల దుస్తులు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ ఆర్సి కార్డులు, ఒక రెడ్మి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 8కి చేరింది అని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వెల్లడించారు.
కస్టడీ విచారణలో కీలక ఆధారాలు
ఈ నెల 17న కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు ముఖ్య నిందితులు – ఏ1 సుబోధ్ సింగ్, ఏ2 రఘునాథ్, ఏ3 రావిష్, ఏ10 అమర్ సింగ్, ఏ11 జైనుల్లాబ్దీన్ – కస్టడీ రేపటితో ముగియనుంది. విచారణలో భాగంగా నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ శివారులో ఏడో నిందితుడు
**సూర్యమణి @ సనోజ్ కుమార్ (21)**ను అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారం ఆధారంగా రామడుగు మండలంలోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద తాత్కాలిక షెడ్ల సమీపంలో దాచిన పిస్టల్, మ్యాగజైన్, దుస్తులు, బూట్లు, నకిలీ ఆర్సి కార్డులు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎనిమిదో నిందితుడి అరెస్టు – బీహార్లో పట్టివేత
మరో కీలక నిందితుడు ఎం.డి. ఆదిల్ ఖాన్ను బీహార్ రాష్ట్రం పాట్నాలోని పుల్వారి షరీఫ్ వద్ద ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేశారు. విచారణలో ఆదిల్ ఖాన్, క్రెటా కార్ డ్రైవర్ జైనుల్లాబ్దీన్కు సహకరించి తుపాకులు, వాహనాలను సరఫరా చేసినట్లు తేలింది.
పోలీసుల కృషికి సీపీ అభినందనలు
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి, బొల్లం రమేష్, బగ్గని శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్సై శేఖర్ తదితర పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ గౌష్ ఆలం అభినందించారు.