హుస్నాబాద్, జూన్ 7 (చైతన్యగళం ): పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ నాయకులు రోడ్డుపై వంట పొయ్యి ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు అందని ద్రాక్షలా మారాయని, మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ నిరసన బలంగా వినిపించింది.